మరో ముగ్గురికి గాయాలు
మృతుల్లో ఇంటర్ విద్యార్థి
యాదాద్రి భువనగిరి జిల్లా మర్రిబాయితండాలో ఘటన
సంస్థాన్ నారాయణపురం, జూలై 14 : విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి చెందిన తల్లోజు అరుణ్చారి (21) మిషన్ భగీరథ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్లో విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వల్లపు ప్రశాంత్ (17) నాంపల్లి మండల కేంద్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో మిషన్ భగీరథ ట్యాంక్ చుట్టూ లైటింగ్ కోసం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడానికి అరుణ్చారి గురువారం అదే మండలానికి చెందిన వంశీ, లింగయ్య, సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన కిరణ్తోపాటు కాలేజీకి సెలవు ఉండడంతో ప్రశాంత్ను కూడా కూలికి తీసుకెళ్లాడు.
మర్రిబాయితండాలో ఐదుగురు కలిసి మూడు స్తంభాలను బిగించి 4వ స్తంభం లేపుతుండగా పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ తీగలకు తాకడంతో షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ప్రశాంత్, అరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వంశీ, లింగయ్య, కిరణ్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆటోలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అరుణ్, ప్రశాంత్ మృతిచెందారు. క్షతగాత్రులు అదే దవాఖానలో చికిత్స పొందుతున్నారు. సీఐ వెంకటయ్య, ఎస్ఐ యుగేంధర్, తాసీల్దార్ పల్లవి పీహెచ్సీకి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. చేతికి అందివచ్చిన కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాలను పీహెచ్సీలో ఉంచి రాత్రి వరకు ఆందోళన చేశారు.
ఎస్డబ్ల్యూ లింగోటంలో విషాదఛాయలు
నాంపల్లి : మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం గ్రామానికి చెందిన తల్లోజు అరుణ్చారి (21), నల్లపు ప్రశాంత్ (17) సంస్థాన్నారాయణపురం మండలంలోని మర్రిబాయి తండావద్ద విద్యుదాఘాతంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయులు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన తల్లోజు కృష్ణాచారి, ధనమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా చిన్న కొడుకు అరుణ్చారి కొంత కాలంగా మిషన్ భగీరథలో కాట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. నల్లపు వెంకటయ్య, నారాయణమ్మ దంపతు చిన్న కొడుకు ప్రశాంత్ రోజు వారి కూలికి వెళ్లాడు. వీరిద్దరూ విద్యుదాఘాతంతో మృతి చెందడంతో ఆయా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.