అల్లూరి సీతారామరాజు జిల్లా : పునరావాస కేంద్రంలో తలదాచుకున్న ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు ఎర్రంపేట చెరువులో మునిగి మృతిచెందారు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగి ఒకరి తర్వాత ఒకరు మునిగి ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి చనిపోవడంతో ఎర్రంపేట పునరావాస కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు నిలువ నీడ కరవై పునరావాస కేంద్రంలో బిక్కు బిక్కుమంటూ గడుపుతుండగా.. మరోవైపు ఇలా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆ కుటుంబీకుల రోదన ప్రతీ ఒక్కర్నీ కంటతడిపెట్టిస్తున్నది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతూరుకు చెందిన ఎర్రమల్లి రాంబాబు, కల్యాణి తమ ఇళ్లు వరద కారణంగా ముంపునకు గురైంది. దాంతో వారు ఎర్రంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. కుమ్మూరుకు చెందిన కురుసం సత్యం, నాగమణి కూడా తమ గ్రామం ముంపునకు గురవడంతో నాగమణి తల్లి వద్దే ఎర్రంపేటలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారి పిల్లలు అక్షిత(8), కురసం దుర్గా భవాని(8)లు ఎర్రంపేటలోని ఎంఈఓ కార్యాలయం వెనుక ఉన్న చెరువు వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయారు.
చాలా సమయం గడిచిపోతున్నా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆదుర్దా మొదలైంది. పునరావాస కేంద్రంలోని చిన్నారులను ఆరా తీశారు. అనంతరం పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. సాయంత్రానికి చెరువులో మునిగి గల్లంతైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలు పైకి తేలి కనిపించాయి. మృతులిద్దరూ 3వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి నీట మునిగి చనిపోవడంతో పునరావాస కేంద్రంలో విషాదం అలుముకున్నది. నీట మునిగిన ఇంట్లో ఉండలేక పునరావాస కేంద్రానికి వస్తే ఇలా జరిగిందంటూ వారి ఆక్రందన అందరినీ కంటతడిపెట్టించాయి. చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ యాదగిరి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.