మంచిర్యాల : ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏ ఒక్కరూ ఆపదలో ఉన్న ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇద్దరి కష్టాలు ఒకటేనని భావించి ముందుకు వెళ్తుంటారు. అలాంటి అన్నదమ్ములు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లారు. అన్న మృతిని తట్టుకోలేని తమ్ముడు బోరున విలపిస్తూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలో చోటు చేసుకుంది.
లక్సెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్(46), శ్రీనివాస్ గౌడ్ అన్నదమ్ములు. అయితే భాస్కర్ గౌడ్ గుండెపోటుతో మరణించాడు. అన్న మృతి చెందాడన్న వార్త శ్రీనివాస్ గౌడ్కు తెలిసింది. దీంతో హుటాహుటిన లక్సెట్టిపేటకు శ్రీనివాస్ గౌడ్ చేరుకుని అన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గంటల వ్యవధిలో గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.