డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం-2005 కింద కేసులు
రూ.వెయ్యి జరిమానా సైతం విధింపు
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు
హైదరాబాద్, మార్చి 29, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలారా పారాహుషార్! మాస్క్ ధరించకుండా ఎవరూ బయటకు రావొద్దని, ఎవరైనా వస్తే కఠిన శిక్షలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మాయదారి కరోనా మరోసారి జడలు విప్పుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారికి వెయ్యి రూపాయలకు తగ్గకుండా జరిమానా విధించేలా, రెండేండ్ల జైలుశిక్ష పడేలా చట్టాలను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారికపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం-2005లోని సెక్షన్ 51 నుంచి 60 కింద, ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. దీంతో మాస్క్ లేకుండా కనిపించేవారిపై కనీసం వెయ్యిరూపాయల జరిమానా విధించనున్నారు. ఆ యా పరిస్థితులను బట్టి జరిమానా మొత్తం మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. మన ఆరోగ్యం కోసం మాస్క్ పెట్టుకుంటే సరే.. లేదంటే మీ జేబుకు చిల్లు తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మాస్క్ పెట్టుకోని సీఐకి ఫైన్
మాస్క్ ధరించని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్కు స్వయంగా జిల్లా సూపరింటెండెంట్ జరిమానా విధించారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. ఆదివారం గుంటూరు అర్బన్ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో స్థానిక లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడాన్ని ఎస్పీ గుర్తించారు. వెంటనే సీఐని దగ్గరికి పిలిచి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. అత్యవసరంగా విధుల్లో హాజరవడానికి వెళుతూ మర్చిపోయినట్టు సీఐ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఎస్పీ.. సీఐకి అపరాధ రుసుం(ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి అందజేశారు.
సీసీ కెమెరాలు పట్టేస్తాయి
గతేడాది కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాస్క్ లేకుండా తిరిగేవారిని గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడిన విషయం తెలిసిందే. మాస్క్ లేకుండా బయట తిరిగేవారిని సీసీటీవీ పుటేజీల ద్వారా గుర్తించి వారికి జరిమానాలు విధించారు. పరిస్థితి తీవ్రతను బట్టి మరోమారు అన్ని రకాల పద్ధతులు వాడేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. డిజాస్టర్మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51 టు 60 ప్రకారం కేసు నమోదైతే రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ.వెయ్యి వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాస్క్ ధరించనివారికి రూ. 250 చొప్పున జరిమానా వేస్తున్నారు. ఆ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 18,565 మందికి రూ.17.34 లక్షల జరిమానా విధించినట్టు ఆ రాష్ట్ర పోలీస్శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్రలో మాస్క్ లేకున్నా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే రూ. 3వేల జరిమానా, మూడు రోజులు పబ్లిక్ సర్వీస్, మూడోసారి పట్టుబడితే రూ.5వేలు జరిమానా, ఐదు రోజులు పబ్లిక్ సర్వీస్ (వీధులు ఊడ్చాలి) వంటి శిక్షలు విధిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న ఢిల్లీలోనూ జరిమానాను రూ.500 నుంచి రూ.2వేలకు పెంచారు.