న్యూఢిల్లీ: కొత్త డిజిటల్ రూల్స్కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వానికి వివరాలు పంపాయి. నిబంధనల పాటింపును పర్యవేక్షించే ముగ్గురు అధికారుల (కంప్లయన్స్ ఆఫీసర్స్) వివరాలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 26 నుంచి అమల్లోకి వచ్చిన ఐటీ రూల్స్ మేరకు గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి పెద్ద కంపెనీలు ప్రభుత్వానికి వివరాలు సమర్పించాయి. కంప్లయన్స్ అధికారులు కంపెనీ ఉద్యోగులై ఉండాలని, వారు భారత్లో నివసించేవారు అయ్యుండాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ట్విట్టర్ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కంపెనీ ఉద్యోగి కాని ఓ న్యాయవాది పేరును పంపించింది. ఇటీవల ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు విపక్ష కాంగ్రెస్ టూల్ కిట్ సరఫరా చేస్తున్నదని పాలక బీజేపీ నేతలు ట్విట్టర్లో మెసేజీలు పెట్టారు. అయితే వారు మసిపూసి మారేడు కాయ చేసిన మీడియాను పెట్టారంటూ ట్విట్టర్ వారి ఖాతాలను ట్యాగ్ చేసింది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇటీవల ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కార్యాలయాన్ని సోదా చేయడంపై కూడా ట్విట్టర్ విమర్శలు సంధించింది. వాక్ స్వాతంత్ర్యానికి సంకెల బిగించడంగా పేర్కొన్నది. బెదరింపు చర్యగా విమర్శించింది. ఇది చట్టం తనపని తాను చేయకుండా అడ్డుపడే చర్యగా ప్రభుత్వం అభివర్ణించింది. శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో ట్విట్టర్ అవిధేయతపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ కూడా దాఖలైంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకైతే ట్విట్టర్ ప్రభుత్వ ఆదేశాలను మన్నించలేదని వార్తలు వెలువడుతున్నాయి.