న్యూఢిల్లీ : రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు ప్లాట్ఫాంలపై రైల్వేలు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను (ఏటీవీఎం) ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మెషీన్స్ నుంచి టికెట్లను పంపిణీ చేయడంలో ఆరితేరిన ఓ రైల్వే ఉద్యోగి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబై రైల్వే యూజర్లు ఈ క్లిప్ను ట్విటర్లో పోస్ట్ చేశారు.
Somewhere in Indian Railways this guy is so fast giving tickets to 3 passengers in 15 seconds. pic.twitter.com/1ZGnirXA9d
— Mumbai Railway Users (@mumbairailusers) June 28, 2022
భారత రైల్వేకు చెందిన ఈ ఉద్యోగి కేవలం 15 సెకండ్లలో ముగ్గురు ప్రయాణీకులకు టికెట్లు ఇస్తున్నాడని ఆ పోస్ట్కు క్యాప్షన్ను జోడించారు. సదరు ఉద్యోగి ఓ ప్రయాణీకుడి నుంచి టికెట్ డబ్బులు వసూలు చేస్తూనే తదుపరి ప్రయాణీకుడికి ఎక్కడికి వెళ్లాలని అడుగుతుండటం వీడియోలో కనిపించింది. అదే సమయంలో అతడు చెప్పిన గమ్యస్ధానానికి ఏటీవీఏంలో పలు ఫీల్డ్స్ను ఎంటర్ చేస్తుండటం కనిపించింది. ఏటీవీఏం మెషీన్ స్క్రీన్ను ఓ యంత్రం మాదిరి వేగంగా ట్యాప్ చేస్తూ క్షణాల్లో పని పూర్తి చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 8,80,000 వ్యూస్ను రాబట్టింది. రైల్వే ఉద్యోగి వేగంగా టికెట్లను పంపిణీ చేయడం చూసి ట్విటర్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్భుత వేగంతో ఆయన చేస్తున్న పనితో సమయం ఎంతో కలిసివస్తోందని నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. మెరుపు వేగంతో ఆయన టికెట్లను పంపిణీ చేస్తున్నారని మరో యూజర్ కితాబిచ్చాడు. సాఫ్ట్వేర్ స్పీడ్ కూడా మెరుగ్గా ఉందని, లేకుంటే మరో విండో ఓపెన్ అయ్యే వరకూ ఆయన వేచిచూడాల్సి ఉండేదని మరో యూజర్ రియాక్టయ్యాడు.