హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి రూ.52 కోట్లు అందించిన సీఎం కేసీఆర్కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు తెలిపింది. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్లు కలిసి మంత్రి కేటీఆర్ తో చర్చించి 24 గంటలు గడవకముందే పదిహేడున్నర కోట్లు మీడియా అకాడమీ ఖాతాలో జమకావడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 34.5 కోట్ల రూపాయలను జర్నలిస్ట్ సంక్షేమ నిధికి తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. మరో 17.5 కోట్ల రూపాయలను గురువారం విడుదల చేయడంతో మొత్తం సంక్షేమ నిధి 52 కోట్ల కు చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు జర్నలిస్టుల పక్షపాతిలు అని మరోసారి చాటుకున్నారన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ.52 కోట్ల నిధిని సమకూర్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, తెంజు అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయుడబ్య్లూజే హైదరాబాద్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యోగానంద్, యార నవీన్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు.