న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం ఒకటి బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆ టన్నెల్ను గుర్తించారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ దారితీసినట్లు భావిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను తరలించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీషర్లు వాడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోట వద్దకు ఆ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు. దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా ఫ్రీడమ్ ఫైటర్లను తరలించినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు.
1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు తాను దీని గురించి వినేవాడినని, రెడ్ ఫోర్ట్కు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్లు చెప్పేవారని, దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానని, కానీ క్లారిటీ రాలేదని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఆ టన్నెల్కు చెందిన ముఖ ప్రదేశాన్ని గుర్తించామన్నారు. కానీ ఆ టన్నెల్ను ఇప్పుడు తొవ్వడం లేదని, ఎందుకుంటే ఆ మార్గంలో మెట్రో పిల్లర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉంటాయన్నారు.
1912లో కోల్కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేశారు. అంతకముందు ఢిల్లీ అసెంబ్లీని సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీగా వాడేవారు. అయితే 1926లో అసెంబ్లీ ప్రాంగణాన్ని కోర్టుగా మార్చారు. ఇక స్వాతంత్య్ర సమరయోధులను కోర్టుకు తెచ్చేందుకు ఈ టన్నెల్ మార్గాన్ని వాడేవారని స్పీకర్ గోయల్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో టన్నెల్ ప్రాంతాన్ని విజిట్ చేసినట్లు చెప్పారు.