‘ఏడాది తర్వాత ప్రేక్షకుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. పాత రోజులు తిరిగివచ్చిన అనుభూతి కలుగుతోంది’ అని అన్నారు హీరో నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ కథానాయికలు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదలకానుంది. శనివారం రాజమండ్రిలో ‘టక్ జగదీష్’ పరిచయ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘ అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. కుటుంబానికి విలువనిచ్చే జగదీష్నాయుడు అనే యువకుడిగా ఈ సినిమాలో నేను కనిపిస్తా. నాజర్, జగపతిబాబు, ఐశ్వర్యరాజేష్, రీతూవర్మతో పాటు ప్రతి పాత్రకు సమప్రాధాన్యత ఉంటుంది.
అభిమానులు నా కోసం కటౌట్లు, పాలాభిషేకాలు, గొడవలు పడటం చేయాలని కోరుకోను. మీరందరూ గర్వపడేలా ఉండటానికే నేను ప్రయత్నిస్తా. అందుకోసం ప్రతిరోజు కష్టపడతానని మాటిస్తున్నా’ అని అన్నారు. ‘ప్రతి కుటుంబంలో బాధ్యతల్ని స్వీకరించే యువకులను పోలి నాని పాత్ర సాగుతుంది. అన్నాదమ్ముల అనుబంధం ఆకట్టుకుంటుంది. తన కుటుంబం కోసం జగదీష్ పడే ఆరాటం హృదయాల్ని కదిలిస్తుంది’ అని దర్శకుడు శివనిర్వాణ అన్నారు. రెండేళ్ల కష్టానికి నిదర్శనమిదని, తమ శ్రమ ఫలిస్తుందనే నమ్మకముందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, మంత్రి భరత్ తదితరులు పాల్గొన్నారు.