తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చేభక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 14 రకాల కూరగాయలతో వారంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన రుచులతో భక్తులకు అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిద ప్రాంతాల నుంచి కూరగాయలు అందించే దాతలతో సంప్రదించాలని సూచించారు.
అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్యకు తగ్గట్టు తయారీ, పంపిణీ చేసేందుకు అవసరమైన సిబ్బందిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు. తిరుమలలో అన్నప్రసాదాలు, అల్పాహారం అందించే దాతల సంఖ్య పెంచేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. సేవా ధృక్పదం కలిగిన పెద్ద హోటల్స్ యాజమాన్యంతో సంప్రదించి తిరుమలలోని అతిథి గృహల వద్ద కాస్ట్ టు కాస్ట్తో కాఫీ, స్నాక్స్ అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు.