తిరుపతి, జూలై : టీటీడీ ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచొద్దని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “అప్పలాయగుంట, శ్రీనివాసమంగాపురం ఆలయాల్లో కళ్యాణ కట్టలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
“టిటిడి అనుబంధ, విలీన ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములను ఎప్పటికప్పుడు లీజుకు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రైతులతో సంప్రదించి సేంద్రియ ఎరువులతో పంటలు పండించి వాటిని తిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీకి అందించేలా చూడాలని ఈఓ ఆదేశించారు. ఆలయాలకు కానుకగా వచ్చే గోవుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేసి వాటి ద్వారా వచ్చే పాలను గో సంరక్షణ శాలకు చేరవేసేలా ఏర్పాట్లు చేయాలని” పేర్కొన్నారు. విలీన ఆలయాలలో ఆదాయం, ఖర్చుకు వ్యత్యాసం లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. ఆలయాల అవసరాలను బట్టి ఎంత మంది ఉద్యోగులు ఉండాలో ఎఫ్ఏ అండ్ సిఎఓతో సంప్రదించి నిబంధనలు తయారు చేయాలన్నారు. ఆలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అనవసరంగా కొత్త భవనాలు కట్టకుండా ఉన్నవి వినియోగించు కోవాలన్నారు. స్థానిక ఆలయాలు, విలీన ఆలయాలకు సంబంధించి మంజూరు చేసిన అభివృద్ధి పనుల వివరాలు డెప్యూటీ ఈవోలకు తెలియచేయాలన్నారు. మంజూరైన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆలయాల ఆదాయం, భక్తుల సంఖ్యను బట్టి గ్రేడ్లుగా విభజించాలన్నారు. తిరుమల ఘాట్రోడ్లోని వినాయక ఆలయంలోని సిమెంట్ విగ్రహం స్థానంలో రాతి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఆలయం చుట్టూ పూల మొక్కలు పెంచి భక్తులకు ఆహ్లాద వాతావరణం కల్పించాలని టీటీడీ ఈఓ అధికారులను ఆదేశించారు.