తిరుపతి జిల్లా : తిరుమల బాలాజీనగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి బుధవారం అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా బాలాజీనగర్లో డ్రైనేజి, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు తదితర వాటిని కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న కాంక్రీట్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజీనగర్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇనుము తదితర వ్యర్థాలను తిరుపతికి తరలించాలన్నారు. వాహనాల పార్కింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఇప్పటివరకు 480 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈఓకు తెలిపారు. అనంతరం అక్కడి స్థానికులకు టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను ఆరు బయట పారవేయకుండా స్థానికులు చూడాలని, పరిసరాల పరిశుభ్రతతోనే శ్రీ వేంకటేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చునని ఈఓ చెప్పారు. తిరుమల కొండపై పచ్చదనాన్ని మరింత పెంచేందుకు చేపట్టిన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డాక్టర్ శ్రీదేవి, వీజీఓ బాలిరెడ్డి, ఈఈ సురేంద్రరెడ్డితో పాటు పలు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.