తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం శుభవార్త చెప్పింది. ఇకపై శ్రీవారి దర్శనానికి అన్నిప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇటీవల రోజుకు 2వేల చొప్పున ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేంది. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన వారికే అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం కోటాను 8వేలకు పెంచింది.
అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు టోకెన్లను ఆధార్కార్డుపై జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఇవాళ ఉదయం నుంచి టోకెన్లు అందుబాటులో ఉంచగా.. తిరుపతి శ్రీనివాసం వసతి సముదాయం వద్ద కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నారు. త్వరలోనే ఆన్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా స్వామివారి ఏకాంత సేవ సమయంలోనూ మార్పులు చేసింది. భక్తులకు రాత్రి 12 గంటల వరకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుండగా.. ఆదివారం నుంచి రాత్రి 12 గంటలకు ఏకాంత సేవ కార్యక్రమం జరుగనుంది.