హైదరాబాద్ : ఆర్టీసీ ప్రయాణికులకు నమ్మకమైన సేవలందిస్తున్న టీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్టీసీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన అభినందించారు. ఒక గొప్ప మార్పునకు శ్రీకారం శిక్షణా కార్యక్రమాన్ని టీఎస్ ఆర్టీసీ నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం కాచిగూడ డిపో పరిధిలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొని, ప్రసంగించారు. ఈ శిక్షణ వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు. మన జీవన విధానంలో మంచి మార్పుతో పాటు వృత్తి నైపుణ్యంలో మెరుగైన ఫలితాలను తీసుకురావడానికి శిక్షణను వినియోగించుకోవాలని కోరారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో టీఎస్ ఆర్టీసీ ప్రథమంగా నిలుస్తుందని చెబుతూ నగరంలో డ్రైవర్ల సేవలు ప్రశంసనీయమని సజ్జనార్ కొనియాడారు. టి24 టిక్కెట్టు అమ్మకాలతో పాటు పెళ్లిళ్లకు, విహారయాత్రలకు ఉపయోగించే బస్ ఆన్ కాంట్రాక్ట్ (అద్దె బస్సుల) వినియోగం కూడా పెరగటం సంతోషదాయకమన్నారు. సంస్థ అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిలో సిబ్బంది పాత్ర ఎంతో ఉందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో నడుస్తున్న సర్వీసుల ద్వారా సంస్థకు కొంత నష్టం వస్తోందని, దీన్ని అధిగమించడానికి బ్రేక్ ఈవెన్ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లక్ష్యం దిశగా పయనించడం వంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడు జీవితంలో రాణించగల్గుతారని సూచించారు.