హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సమష్టి కృషే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రయాణికులకు మరింత సంతృప్తికరమైన సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని డిపోల ఆర్టీసీ సిబ్బందికి నెల రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు ‘ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం’ అనే పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని సోమవారం వారు ప్రారంభించారు. అనంతరం సిబ్బందికి ఆన్లైన్ ద్వారా సందేశమిచ్చారు. నిరుటితో పోలిస్తే ఆర్టీసీకి నష్టాలను రూ.515.95 కోట్లు తగ్గించుకోగలిగామని బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్ వివరించారు. కార్గో, పార్సిల్ సేవల ద్వారా ఈ ఏడాది జూలై వరకు రూ.11.02 కోట్ల లాభాలు వచ్చినట్టు తెలిపారు.