కార్గో సేవలకు రెండు వసంతాలు పూర్తి
అవసరాలకు అనుగుణంగా సేవల విస్తరణ
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ద్వారా రెండేండ్లలో ఆర్టీసీకి రూ.120.52 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కార్గో సేవలు ప్రారంభించి ఆదివారంతో రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్సిళ్ల బట్వాడా ద్వారా రూ.88.68 కోట్లు, కార్గో రవాణాతో రూ.31.84 కోట్లు సమకూరినట్టు పేర్కొన్నారు.
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని కరోనా మహమ్మారి ఆర్థికంగా మరింత దెబ్బతీసిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంస్థ ఆదాయం పెంచుకునేందుకు పార్సిల్, కొరియర్, కార్గో సేవలను 2020 జూన్ 19న ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. ఇంటింటికీ సైతం సేవలను ప్రారంభించామని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కార్గో సేవలను ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని నగరాలకూ విస్తరించామని పేర్కొన్నారు. కార్గో సేవలను వాడుకుంటున్న వినియోగదారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.