అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. వ్యక్తిగత పర్యటనపై చీరాల కు వెళ్లిన స్పీకర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు స్పీకర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలేజీ లోని కోర్సులు, వసతులు, బోధన పద్దతులు, పరిశోధనలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం లోని ఏకైక Food Science and Technology కళాశాల బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూరు లో ఏర్పాటు చేశామని వివరించారు.ఈ కళాశాలను మరింతగా అభివృద్ధి చేయడానికి అవసరమైన సూచనల కోసం బాపట్ల కాలేజీ ని సందర్శించానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీటిని, హరితహారం ద్వారా స్వచ్ఛమైన గాలిని అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టిందని అక్కడి అధికారులకు, విద్యార్థులకు ఆయన వివరించారు.