హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మునుగోడులో పోటీ ఎవరి మధ్య..? అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఫ్లోరోసిస్ భూతాన్ని నల్లగొండ బిడ్డలకు శాపంలా ఇచ్చిన కాంగ్రెస్.. ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతిఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని, మానవత్వంలేని బీజేపీ.. ఫ్లోరోసిస్ నుంచి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్.. ఎవరి మధ్య పోటీ?’ అని కేటీఆర్ ప్రశ్న వేశారు. నాటి ప్రధాని వాజ్పేయి టేబుల్ మీద ఉన్న ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యమని పేర్కొన్నారు. స్వయంగా ప్రధానికి మొరపెట్టుకొన్నా పైసా ఇవ్వలేదు, సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన శాశ్వతంగా ఫ్లోరైడ్ సమస్యను తీర్చిన మాట వాస్తవమేనని కేంద్రమే పార్లమెంట్లో చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు.