హైదరాబాద్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ గురువులను ప్రభుత్వం సన్మానించనుంది. కరోనా కారణంగా గతేడాది గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. గత ఏడాదిలో అవార్డు గ్రహీతలను మాత్రమే ఎంపికచేసి, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జిల్లాల్లోనే ఎక్కడికక్కడ అవార్డులను అందజేశారు. ప్రస్తుతం కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఎప్పటిలాగే ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలను ప్రభుత్వం సన్మానించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిలను విద్యాశాఖ అధికారులు ఆహ్వానించారు. ఇంటర్ విద్యామండలి 11 మంది అధ్యాపకులను అవార్డులకు ఎంపికచేయగా, పాఠశాల విద్యాశాఖ 40 మంది టీచర్లను ఎంపిక చేసింది.