వనపర్తి: వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం పలు గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్లలో 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రేవల్లి మండలం చాకల్ పల్లిలో నూతన 33/11 సబ్ స్టేషన్ ప్రారంభించారు. అనంతరం తల్పునూరులో 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు సమస్యలు లేకుండా రెండు లేదా మూడు గ్రామాలకు ఒకటి చొప్పున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
మరో 40 ఏండ్ల వరకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోతలు లేని, నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు ప్రాధాన్యం ఇస్తున్నుట్లు తెలిపారు. రూ.కోటి 80 లక్షలతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా విపత్తు మూలంగా దాదాపు లక్ష కోట్ల ఆదాయం రాష్ట్రం కోల్పోయిందని వివరించారు. అయినా కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి ఏ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు.
కరోనా ఇబ్బందుల్లోనూ మూడు విడతల్లో రూ.21 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. కేఎల్ఐ కాలువల మరమ్మతులు కొనసాగుతున్నాయని.. చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందేలా రైతులందరూ సహకరించాలని సూచించారు. త్వరలోనే నూతన పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. రూ.50 వేల రుణమాఫీ అయిదారు రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.