హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ): టీఎస్ ఎంసెట్-2021 షెడ్యూల్ను ఉన్నతవిద్యామండలి శనివారం విడుదల చేసింది. ఈ నెల 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నది. 20వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 18వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. జూలై 5 నుంచి 9వ తేదీవరకు ఎంసెట్ నిర్వహిస్తారు. ఎంసెట్-2021పై సెట్ కమిటీ శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో టెస్ట్జోన్లు, సిలబస్, పరీక్ష ఫీజుపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించటానికి 60 రోజులపాటు గడువు ఇచ్చారు. ఎంసెట్ ప్రశ్నాపత్రాన్ని ఈసారి కూడా 160 ప్రశ్నలతోనే రూపొందించనున్నారు. కరోనా కారణంగా ఈసారి విద్యాసంవత్సరం సాఫీగా సాగకపోవటంతో ప్రశ్నల సంఖ్యను పెంచి చాయిస్ ఇస్తే విద్యార్థులకు వెసులుబాటు ఉంటుందని ఉన్నతవిద్యామండలి గతంలో భావించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని కూడా వేసింది.
ప్రశ్నల సంఖ్య పెంపుతో పెద్దగా ఉపయోగం ఉండదని కమిటీ సూచించటంతో 160 ప్రశ్నలతోనే 160 మార్కులకు ప్రశ్నాపత్రం ఇవ్వాలని తుది నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది ఎంసెట్లో ఇంజినీరింగ్ పేపర్ కాకుండా అగ్రికల్చర్ విద్యార్థులకు ముందుగా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్ష పేపర్ సిలబస్పై కూడా కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఇంటర్ మొదటి ఏడాది సిలబస్లో 100%, సెకండియర్లో 70% సిలబస్ నుంచే ఎంసెట్లో ప్రశ్నలు వస్తాయని అధికారులు తెలిపారు. 160 ప్రశ్నల్లో ఫస్టియర్ పాఠ్యాంశాల నుంచి 55%, సెకండియర్ నుంచి 45% ప్రశ్నలు అడుగుతారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష ఉంటుంది. మొదటి సెషన్లో ఉదయం 9 గంటలనుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.