రాజ్నాథ్ ‘గాంధీ-సావర్కర్’ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతల విమర్శ
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: మహాత్మాగాంధీ కోరడం వల్లే వీర్ సావర్కర్ బ్రిటిషర్లకు క్షమాపణ పిటిషన్లు పెట్టుకున్నారన్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నేతలు ఘాటుగా స్పందించారు. చరిత్రను తిరగరాయాలని రాజ్నాథ్ ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. ఈ మేరకు గాంధీజీ 1920 జనవరి 25న రాసిన లేఖను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్లో షేర్ చేశారు. అది ఒక కేసుకు సంబంధించి సావర్కర్ సోదరుడికి రాసిన లేఖ. ఆ లేఖలో గాంధీజీ రాసిన విషయాన్ని రాజ్నాథ్ వక్రీకరిస్తున్నారని జైరాం, అసదుద్దీన్ విమర్శించారు. సావర్కర్ తొలి పిటిషన్ను జైలుకెళ్లిన ఆరు నెలలకు 1911లో రాశారని, అప్పటికి గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నారని అసదుద్దీన్ పేర్కొన్నారు. 1913/14లో కూడా సావర్కర్ పిటిషన్లు పెట్టారని, గాంధీజీ సలహా ఇచ్చింది 1920లో అని రాశారు. మోదీ సర్కారులో గౌరవంగా, హుందాగా మాట్లాడే కొద్దిమందిలో రాజ్నాథ్ ఒకరని, ఆయన కూడా చరిత్రను మార్చిరాసే ఆరెస్సెస్ అలవాటు నుంచి బయటపడలేదని జైరాం వ్యాఖ్యానించారు.
సావర్కర్ బ్రిటిషర్లతో కుమ్మక్కయ్యారు: బఘేల్
సావర్కర్ 1925లో జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటిషర్లతో కుమ్మక్కై, వారి ‘విభజించి పాలించు’ అనే ఎజెండా కోసం పనిచేశారని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఆరోపించారు. ‘రెండు దేశాల సిద్ధాంతా’న్ని మొదట లేవనెత్తింది సావర్కరేనని వ్యాఖ్యానించారు. రాజ్నాథ్ వ్యాఖ్యలపై బఘేల్ స్పందిస్తూ అప్పుడు మహాత్మాగాంధీ వార్దాలోను, సావర్కర్ సెల్యులార్ జైలులో ఉన్నారని, వారు ఎలా మాట్లాడుకుని ఉంటారని ప్రశ్నించారు. జైలు నుంచే సావర్కర్ అరడజను సార్లు క్షమాపణ పిటిషన్లు పెట్టుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆయన బ్రిటిషర్ల పక్షానే ఉన్నారని, వారికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు.
సావర్కర్ క్షమాపణ కోరలేదు: రౌత్
సావర్కర్ ఎప్పుడూ బ్రిటిషర్లను క్షమాపణ కోరలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. పదేండ్లకు పైబడి జైళ్లలో మగ్గిన స్వాతంత్య్ర సమరయోధులు బయటకు వెళ్తే ప్రజల కోసం ఏదైనా చేయవచ్చనే ఆలోచనతో వ్యూహాన్ని అనుసరించవచ్చని అన్నారు. సావర్కర్ అలాంటి వ్యూహాన్ని అనుసరించి ఉంటే అది క్షమాపణ కోరడం కిందకు రాదని చెప్పారు.