బెంగళూరు: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రత్యేకించి అత్యాధునిక మొబైల్ సేవలు వినియోగంలోకి వచ్చాక సైబర్ మోసాలు పెరిగాయి. వాటిని నియంత్రించడానికి కాలర్ ఐడీని కనిపెట్టేందుకు అందుబాటులోకి వచ్చిందే ట్రూ కాలర్ యాప్.. ఈ యాప్ యాజమాన్యం నాలుగేండ్ల క్రితం ప్రారంభించిన ఆన్లైన్ చెల్లింపుల సేవలు ఇకపై భారత్లో నిలిచిపోనున్నాయి. ట్రూకాలర్ ప్రతినిధులు సోమవారం ఈ సంగతి చెప్పారు.
దేశంలో ట్రూకాలర్ పే పేరుతో ట్రూకాలర్ యూపీఐ చెల్లింపులు నిర్వహిస్తున్నది. ఇప్పటికే యూపీఐ చెల్లింపులకు అనేక యాప్లు అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక తమ యూజర్లకు కమ్యునికేషన్, భద్రత సంబంధిత అంశాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ట్రూకాలర్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు వినియోగదారులకు రెండు వారాల క్రితం నోటీసును ఇచ్చామని వారు పేర్కొన్నారు.
తమ యాప్ ద్వారా యూజర్లకు భద్రత, కమ్యునికేషన్ను అందిస్తామని ట్రూకాలర్ ప్రతినిధులు తెలిపారు. 2020లో ట్రూకాలర్ పేలో 20 మిలియన్ల యూపీఐ అకౌంట్లు ఉన్నాయి. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులతో ఈ యాప్ అనుసంధానమై సేవలందించింది.
ట్రూకాలర్ తాజాగా వినియోగదారులకు గార్డియన్ అనే సేఫ్టీ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో గార్డియన్స్గా కొందరిని ఎంచుకొని మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందేలా చేయొచ్చు. వారికి లొకేషన్ పంపడంతో వారు మన కదలికల్ని గుర్తిస్తారు. ఎప్పుడైనా ప్రమాదకర పరిస్థితుల్లో పడినపుడు ఐ నీడ్ హెల్ప్ అన్న ఆప్షన్ నొక్కితే చాలు. గార్డియన్లు గుర్తించి అప్రమత్తమవుతారు.