మునుగోడు, ఆగస్టు 12 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వలా భం కోసమే రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రజాదీవెన సభ కోసం మునుగోడు మండల కేంద్రం, సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక, నారాయణపురం, గుడిమల్కాపురం గ్రామాల్లో మంత్రి శుక్రవారం పర్యటించి స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ప్రయోజనాల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన నీచుడు రాజగోపాల్రెడ్డి అని అన్నారు. అలాంటి అభివృద్ధి నిరోధకుడిని మునుగోడు ప్రజలు తరిమికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రానివ్వమని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ సర్కారు ఎన్నో కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారని తెలిపారు. అంతకు ముందు చల్మెడ గ్రామంలో మంత్రి జగదీశ్రెడ్డికి మహిళలు, చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.