దేశంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్య విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని, ఆ పార్టీ ఆగడాలను నిలువరించే శక్తి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కే ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం ఉమ్మడి జిల్లాకు చెందిన వామపక్ష పార్టీల ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణతోపాటు బీజేపీయేతర రాష్ర్టాల్లో అభివృద్ధి, సంక్షేమానికి మోదీ సర్కారు అడ్డుపడుతున్నదన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తున్నదని విమర్శించారు. బీజేపీ కుట్రలను ఉపేక్షించుకుంటూ పోతే దేశం ప్రమాదం అంచుకు చేరుతుందని, ఆ పార్టీని నిలువరించాల్సిన అవసరం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రూపంలో వచ్చిందని అన్నారు. ఆ శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీకే ఉన్నదని తెలిపారు. అందుకు తోడ్పాటును అందించే ప్రగతిశీల శక్తులను కలుపుకొని పోతామని చెప్పారు.
నీలగిరి, అక్టోబర్ 6 : దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తుందని ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో వామపక్ష పార్టీల నాయకులతో సమన్వయ సమావేశం, అనంతరం వారితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమగ్రతకు భంగం కలిగేరీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని నిలువరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్యన విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. అంతటితో ఆగని మోదీ సర్కారు తెలంగాణతో సహా బీజేపీయేతర రాష్ర్టాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడుతుందని మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ప్రజలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కావాలంటూ వస్తున్న డిమాండ్లే కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరించేందుకు కారణమని పేర్కొన్నారు. అలాంటి బీజేపీని ఉపేక్షించుకుంటూ పో తే దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నా రు. బీజేపీని నిలువరించాల్సిన అవసరం ప్ర స్తు తం మునుగోడు ఉప ఎన్నిక రూపంలో వచ్చిందన్నారు. ఆ శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీకే ఉందన్నారు. అందుకు తోడ్పాటు అందించే ప్రగతిశీల శక్తులను కలుపుకొని పోవాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. అందుకు మునుగోడు ఉప ఎన్నికనే వేదికగా ఎంచుకుని వామపక్షాలతో కలిసి బీజేపీపై పోరాటానికి శ్రీకారం చుట్టామన్నారు. దేశంలో కాంగ్రెస్ బలహీన పడిందని, బీజేపీని బలంగా వ్యతిరేకించే శక్తులను కలుపుకోవడంలో భాగంగా వామపక్షాలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించామని, అందుకు అవసరమైన సమన్వయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బీజేపీతో దేశానికి పెను ప్రమాదం : పల్లా
బీజేపీతో దేశానికి పెనుప్రమాదం పొంచి ఉందని సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మునుగోడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. కేంద్రంలో కొలువుదీరిన ఆ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పేదలకు భారంగా సంక్రమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని జాతీయ స్థాయిలో గుర్తించామన్నారు. అందుకే టీఆర్ఎస్(బీఆర్ఎస్)తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాన్ని పకడ్బందీగా రూపొందించినట్లు తెలిపారు.
బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కే ఉంది : చెరుపల్లి
మునుగోడు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఈ ఎన్నికకున్న ప్రాధాన్యం దృష్ట్యా బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ప్రగతిశీల శక్తులపై పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించగల శక్తి, సామర్థ్యాలు కేవలం టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు మాత్రమే ఉన్నందున మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీని బలపర్చాలని సీపీఎం నిర్ణయించిందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, సీపీఎం, సీపీఐ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, ఎండీ జహంగీర్, నెల్లికంటి సత్యం, గోదాశ్రీరాములు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, చౌట్టుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.