హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘దేశ ప్రజలు బలమైన రాజకీయ పక్షం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అపజయాలతో కోలుకోలేకపోతున్నది. బీజేపీని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. టీఆర్ఎస్ దేశమంతా విస్తరించాలి. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించండి’ అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్తో ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్ సవివరంగా చెప్పినట్టు తెలిసింది.
‘దేశ రాజకీయాల గురించి విస్తృత చర్చ నడుస్తున్నది. నాతో కూడా అనేక రంగాల వారు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ తన పాత్రను పోషించడంలో ఘోరంగా విఫలమైంది. బీజేపీ దేశాన్ని సరైన రీతిలో నడిపించడంలో విఫలమైంది. ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది దుస్సంప్రదాయం. దేశం అన్నిరంగాల్లో ఘెరంగా విఫలమవుతున్నది. మోదీ ప్రధాని అయ్యాక దేశం సాధించిన విజయం ఒక్కటి కూడా లేదు. కరోనాతో ప్రజలు చస్తుంటే పట్టించుకోలేదు. మతాలను, కులాలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడం తప్ప దేశాభివృద్ధి గురించి బీజేపీ ఎన్నడూ మాట్లాడలేదు. దేశాన్ని బాగు చేసుకుందామన్న సోయి వాళ్లకు లేదు. మనం దీన్ని చూస్తూ కూర్చోవాలంటారా..?’ అని జిల్లా అధ్యక్షులను, సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రులను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి వారంతా ముక్తకంఠంతో కచ్చితంగా వ్యతిరేకిద్దామని, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని చెప్పారు.
కొంతమంది ఇప్పటికే ముందుకు వచ్చారు
టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరిస్తే తాము కలిసి పనిచేస్తామని పలు రాష్ర్టాలకు చెందిన నాయకులు ఇప్పటికే వచ్చి తనతో చెప్పారని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు వివరించినట్టు తెలిసింది. పార్టీ పేరును జాతీయ స్థాయిలో పోటీకి అనుకూలంగా మార్చాలని పలువురు నేతలు ప్రతిపాదించగా, దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకొందామని, సమావేశంలో తీర్మానం చేద్దామని సీఎం అన్నట్టు సమాచారం.
సంచలనాత్మక ప్రకటన ఉంటుంది..
సీఎం కేసీఆర్తో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. దసరా రోజున కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రకటన చేస్తారని చెప్పారు. ప్రభుత్వ విప్ ఆర్ కాంతారావు మాట్లాడుతూ.. 5న సీఎం కేసీఆర్ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారని తెలిపారు. కొన్ని పార్టీలు టీఆర్ఎస్లో విలీనం కావడంతోపాటు మరికొన్ని పార్టీలు కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని తాము సీఎంను కోరినట్టు వెల్లడించారు. కనుకదుర్గమ్మ ఆశీస్సులతో ఈ నెల 5న గొప్ప నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. బీజేపీ మొండివైఖరి కారణంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వడం లేదని విమర్శించారు.
జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుదాం
జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుదామని, సమగ్ర కార్యాచరణ రూపొందించుకొని అమలు చేద్దామని సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. దసరా రోజు మంచిదని, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్ సభ్యులు అందరూ రావాలని, ఈ నెల 5న ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్లో సమావేశమవుదామని ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. అంతా కలిసి 300 మంది వరకు వస్తారని, అందరి అభిప్రాయాలు తీసుకొని, అదేరోజు తీర్మానం చేద్దామని చెప్పినట్టు సమాచారం. దసరానాడు జాతీయ స్థాయిలోని పలువురు నేతలు కూడా అతిథులుగా వస్తారని, తమ అభిప్రాయాన్ని చెప్తారని తెలిపారు. మరిన్ని విషయాలు దసరా రోజే మాట్లాడుకుందామని, జాతీయ రాజకీయ ప్రవేశంపై తానే స్వయంగా ప్రకటన చేస్తానని సీఎం చెప్పినట్టు తెలిసింది. అవసరమైతే దసరా తర్వాత రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ సభ పెడదామని అన్నారు.