హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ పరువు తీసేవిధంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం, 14, 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు వ్యవహారం, చేపట్టిన పనుల్లో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతున్నదా? ఒకవేళ అది నిజమని తేలితే కేంద్రం ఏవైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నదా? అని బండి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆర్టికల్ 280 ప్రకారం వీటిపై రాష్ట్రప్రభుత్వాలకే పూర్తి అధికారం ఉంటుందని, కేంద్రానికి చర్యలు తీసుకునే అవకాశమే ఉత్పన్నం కాదని తెలిపారు. ఈ సమాధానం చూశాకైనా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో బండి సంజయ్ తెలుసుకోవాలని సతీశ్రెడ్డి హితవుపలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు వేలకోట్లు విడుదల చేస్తూ రాష్ర్టానికి మొండిచేయి చూపుతున్నదని.. సంజయ్కు దమ్ముంటే దానిపై పోరాడాలని సూచించారు. నిధులపై కేంద్రాన్ని నిలదీయకుండా పార్లమెంట్లో పనికిరాని ప్రశ్నలు అడిగి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి ఉన్నా ఇప్పటికి తెచ్చింది గుండుసున్నా అని ఎద్దేశాచేశారు. రాష్ర్టానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వని బీజేపీకి హుజూరాబాద్లో ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారని పేర్కొన్నారు.
1.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథక నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించింది నిజమేనా? మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ సీమ్ నిధులను ఖర్చుపెట్టటంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతున్నదా? అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఆ రెండు ప్రశ్నలకు సదరు కేంద్రమంత్రి నుంచి “కాదు, లేదు” అన్న లిఖిత పూర్వక సమాధానం వచ్చింది. ఇక్కడా.. రాష్ట్ర పరువును బజార్లో తాకట్టు పెట్టేలా అర్వింద్ వ్యవహరించారు. కానీ నిజం నిగ్గుతేలింది.
‘కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిధులు, నిర్వహణ అంతా తెలంగాణ ప్రభుత్వమే చూసుకొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ప్లాన్కు అనుగుణంగా ప్రాజెక్టును కడుతున్నారా? లేదా? ఆర్థిక వనరుల నిర్వహణ ఎట్లా సాగుతున్నది? అన్న విషయాలను మాత్రమే కేంద్రం పరిశీలిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం పెంపు విషయంలో పెరిగిన ధరలు, జీఎస్టీ తదితర కారణాల వల్ల ప్రాజెక్ట్ వ్యయం రూ.80,190.46 కోట్ల నుంచి రూ.88,557.44 కోట్లకు పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సమాచారం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానాన్ని అనుసరించి పూర్తి పారదర్శకతను పాటించింది’ అని కేంద్రమంత్రి జవాబిచ్చారు.