హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): అగమ్యగోచర స్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామని, నేడు సగర్వంగా ఇదీ మా తెలంగాణ అని చెప్పుకొనే స్థాయికి చేరామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం హైటెక్స్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
అపనమ్మకం నుంచి నమ్మకం వైపు
ఈ 20 ఏండ్ల ప్రస్థానం తర్వాత మళ్లీ ఒకసారి అధ్యక్ష భాధ్యతలు చేపట్టాల్సిందిగా నన్ను మీరంతా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. 2001 ఏప్రిల్ 27న స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయంలో జలదృశ్యంలో ఈ గులాబీ పతాకాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకొని ఉన్న అనుమానాల మధ్య గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ సమాజాన్ని దానిలోంచి బయటకు ఎలా తేవాలని ఆలోచించాం. అందుకే నేను స్వయంగా ఓ పాట రాశాను ‘సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని.. అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్య్రం.. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుంది’ అని. సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు. వెయ్యని నింద లేదు. సృష్టించని అరాచకాలు లేవు. మనం పట్టుదలతో ఎప్పటికప్పుడు విశ్లేషించుకొంటూ ముందుకు సాగాం కాబట్టే విజయ తీరాలకు చేరాం.
ప్రపంచానికే కొత్త భాష్యాన్ని చెప్పింది ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి అనుభవాలు, జ్ఞాపకాలు సింహావలోకనం చేసుకొంటే మనం నిర్వహించిన కార్యక్రమాలు, చేసిన కవాతు యావత్ తెలంగాణ ఏకోన్ముఖంగా విజృంభించిన తీరు.. ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యాన్ని చెప్పింది. శాంతియుత పంథాలో, అహింసాయుతంగా కూడా గమ్యాన్ని చేరుకోవచ్చనే కొత్త బాటను, కొత్త లక్ష్యాన్ని ప్రపంచ ఉద్యమాలకు మనం నిర్దేశించగలిగాం. ఇది చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా ఉండే కీర్తి. ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర్రావును ఓసారి ఆయన పుట్టిన రోజు సందర్భంగా వారి ఇంటికి వెళ్లి కలిసినప్పుడు ‘ఉద్యమ నేతగా వచ్చిన మీరు పరిపాలనలోనూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు. ఇదే రీతిలో పురోగమించండి’ అన్నారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని నాతో చెప్పారు. తెలంగాణ ఏర్పడేవరకు ఉన్న ఆవేశం, ఉద్వేగభరితమైన పరిస్థితులను మరింత ఉద్విగ్నం చేయకుండా కార్యాచరణలోకి మలచడం గొప్ప బాధ్యత. ఆ పని మనం విజయవంతంగా చేయగలిగాం.
ఏ పనిచేద్దామన్నా వేల కేసులు
నెగెటివ్ ఫోర్స్లు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై వేల కేసులు.. చివరకు సెక్రటేరియట్ కడతామన్నా కేసులే. యాదాద్రి గుడి పునర్మిస్తాం అన్నా కేసులే.. మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ ఇలా ఏపనిపైనైనా కేసులే. వాటన్నింటినీ ఛేదించుకుని, ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ అద్భుతమైన ఆవిష్కరణలు సాధిం చాం. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశాం. కునారిల్లిన పాలమూరులో 12 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం. ఉత్తర తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసుకోవడంతోపాటు కొత్త ప్రాజెక్టులు తేవడానికి ఇంజినీరింగ్ రీడిజైన్ చేసి చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల, డిండి.. ఇటీవల చేపట్టిన నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ లిఫ్ట్లు, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్లు ముందుకు సాగుతున్నాయి.
గులాబీ జెండా ఎత్తిన నాడు గేలిచేశారు
తెలంగాణ కోసం గులాబీ జెండా ఎత్తిననాడు ఎంతో మంది మనల్ని గేలి చేశారు.. ‘ఏం దుకాణం పెట్టిండ్రు’ అని తేలికగా మాట్లాడారు. వాళ్లందరి సాక్షిగానే మనం తెలంగాణ సాధించాం. ఈ రోజు కూడా చేతకాని, చేవలేని, కలలు కనలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న కొందరు ఇదెట్టా.. అదెట్టా అని మాట్లాడుతున్నరు. మనం రైతుబంధు పెట్టిననాడు కూడా ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు ఎంతో అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. పంటలు అద్భుతంగా పండుతున్నాయి. రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. ఏ రాష్ట్రంలోలేని విధంగా రైతుబీమా అనే అద్భుతమైన పథకాన్ని పెట్టుకున్నాం. రైతుల తలరాతలు కిందమీద చేసేలా అడ్డదిడ్డమైన రాతలు రాసే వీఆర్వోలను తీసేసి ధరణిని తెచ్చాం. నేత, గీత కార్మికుల ఎక్స్గ్రేషియా చెల్లించడంలో సఫలీకృతమయ్యాం. సింగరేణి కార్మికులకు దేశంలోనే ఎవరూ ఇవ్వనంత బోనస్లు ఇస్తున్నాం. పింఛన్ 2 వేలు చేశాం. తెలంగాణలో తప్ప బీడీ కార్మికులకు పింఛన్ మరే రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని, ఉన్న వనరులు అతి జాగ్రత్తగా వాడుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఇదే పంథాలో ముందుకు సాగుతాం.