బంపర్ మెజార్టీతో విజయం ఖాయం
కల్లోలాలతో పబ్బం గడుపుతున్న బీజేపీ
ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చు చేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
యాదాద్రి, జూలై 11 : నిరుపేదలు, దళితులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉందని, రాబోయే 2023 ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం మెట్ల మార్గం గుండా వెళ్లి యాద్రాదీశుడిని దర్శించుకున్న ఆయన అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ చక్కటి పాలన అందిస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చుచేసే ఏకైన పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. మత కల్లోలాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. అంబేద్కర్ అందజేసిన రిజర్వేషన్లను లేకుండా చేయాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు అవసరమని అన్నారు. లక్ష ఉద్యోగాలిచ్చి తెలంగాణ యువతను ఆదుకున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తానని కేంద్ర ప్రభుత్వం రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేని అన్నారు.
ప్రజారంజకమైన పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కారుకే మరోసారి జనం పట్టకడుతారని తెలిపారు. అంతకుముందు ఆయన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య కేక్ను కట్ చేశారు. ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి మోత్కుపల్లిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, రైతుబంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, కౌన్సిలర్ బూడిద సురేందర్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శ్రీనివాస్, మల్లాపురం మాజీ సర్పంచ్ బాలయ్య, నాయకులు నరహరి, రామ్మూర్తి, మాజీ ఎంపీపీ ఇస్తారి, ప్రవీణ్, నర్సింహులుగౌడ్, మాజీ జడ్పీటీసీ భిక్షపతి, నర్సింహులు, సిరబోయిన నర్సింహులు యాదవ్, మల్లయ్య, మాధవులు, గోపాల్, సత్తయ్య పాల్గొన్నారు.