హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎన్నారై టీఆర్ఎస్ యూకే (లండన్) 11వ వార్షికోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఖండాంతరాల్లో గులాబీ జెండా మోసే అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నారై యూకే అధ్యక్షుడు దూసరి అశోక్గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. లండన్ వేదికగా శాఖను ప్రారంభించిన మొదటి రోజు నుంచి నేటివరకు వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ, తమను ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తామని, ఇందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై శాఖల నాయకులు, కార్యకర్తలు, మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.