హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలతో ప్రజల్లో బీజేపీ చులకన అవుతుందన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీఆర్ఎస్ నాయకత్వంపై బురదజల్లి, తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
ఇంత వరకు తెలంగాణకు ఏం చేశామో చెప్పుకోలేక, అందరి దృష్టి తమ తప్పిదాల నుండి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సరిగ్గా మునుగోడు ఉపఎన్నికల సమయం చూసి కేసీఆర్ కూతురిపై బురదజల్లి తద్వారా తాము లాభం పొందాలనుకుంటుందని తెలిపారు. అమిత్ షా చెప్పులు మోసే వీళ్ళు తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అయిన టీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే తెలంగాణ సమాజం సహించదని, మునుగోడు ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారని కాసర్ల నాగేందర్ రెడ్డి స్పష్టం చేశారు.