హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎవరితోనైనా కొట్లాడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, తెలంగాణకు తనదైన బాణీ, వాణీ వినిపించే నాయకత్వం ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్తుండేవారని గుర్తుచేశారు. ఢిల్లీ, గుజరాత్ చెప్పుచేతుల్లో ఉండే నాయకత్వం తెలంగాణకు అవసరంలేదని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలే శిరోధార్యంగా పనిచేసే నాయకత్వం కావాలని, అది టీఆర్ఎస్సే అని ప్రజలకు మరింత దృఢంగా చెప్తామని అన్నారు. ‘మిగతా రాజకీయ పార్టీలకు దేశంలోని 28 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. కానీ టీఆర్ఎస్కున్నది తెలంగాణ మాత్రమే. అదే టీఆర్ఎస్కు, మిగతా పార్టీలకు ఉన్న తేడా’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు టీఆర్ఎస్తోపాటు తెలంగాణకు కూడా అరుదైన సందర్భమని వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఈ నెల 25న నిర్వహించే ప్లీనరీ, వచ్చే నెల 15 వరంగల్ సభ తదితర అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పార్టీకి ప్రభుత్వానికి సమ ప్రాధాన్యం
ఇకనుంచి పార్టీకి, ప్రభుత్వ పాలనకు సమ ప్రాధాన్యం ఇస్తాం. పార్టీని దేశంలోనే బలమైన రాజకీయ సంస్థగా తీర్చిదిద్దుతాం. టీఆర్ఎస్ ఎవరికీ తలవంచదు, తెలంగాణ ప్రజలే మా బాస్లు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అన్నిస్థాయిల కమిటీలు పూర్తయ్యాయి. కేసీఆర్ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ప్లీనరీ, విజయగర్జన సభ, సంస్థాగత శిక్షణ ఇలా 9 నెలలు ఏకోన్ముఖంగా కార్యక్రమాలు ఉంటాయి. బహుళ నాయకత్వం టీఆర్ఎస్ బలానికి సంకేతం, ఒక్కో నియోజకర్గంలో ఎమ్మెల్యే స్థాయి నేతలు ముగ్గురు, నలుగురు ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, రైతుబంధు చెక్కులు ఇచ్చే అవకాశం కల్పించాలని అడిగారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం.
అరుదైన నాయకుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ అరుదైన నాయకుడని జాతీయ నేతలే స్వయంగా ప్రశంసించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశాక నాటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని కలిసినప్పుడు చంద్రశేఖర్జీ.. మీ జన్మ ధన్యమైంది. మనిషి జీవితకాలంలో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించటమే కష్టం. కానీ లక్ష్యాన్ని సాధించటమే కాకుండా సాధించుకున్న రాష్ర్టానికి సీఎంగా ఉండాలని ప్రజలు మిమ్మల్నే ఎన్నుకోవటం అసాధారణ సన్నివేశం’ అని ప్రశంసించారు. ‘ఉత్తమ నిరసనకారులు లేదా ఉత్తమ పాలకులు ఉంటారు. కేసీఆర్ మాత్రం బెస్ట్ యాజిటేషన్ చేశారు. బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇదొక అద్భుతమైన కలయిక’ అని దివంగత కేంద్రమంత్రి అరుణ్జైట్లీ కితాబిచ్చారు.
త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ
త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భర్తీ చేస్తాం. కొంతమంది సీనియర్ నాయకులకు న్యాయం చేయాలి. కేసీఆర్ రత్నాల్లాంటి నాయకులను తయారు చేశారు, వారు 25-30 ఏండ్లపాటు రాజకీయాల్లో ఉంటారు. టీఆర్ఎస్లో తర్ఫీదు పొందిన ఎంతోమంది ఇతర పార్టీల్లోకి వెళ్లారు. రాష్ట్ర సాధనకు అవసరమైతే పార్టీనే త్యాగం చేయాలని ఒకానొక సమయంలో కేసీఆర్ అనుకున్నారు. టీఆర్ఎస్ను జాతీయ పార్టీలకు అప్పగించొద్దని ప్రజలు, ప్రజాసంఘాలు తెలంగాణ భవన్ ముందు ధర్నాలు చేశాయి.
వ్యవసాయ ప్రగతి
పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల మాదిరిగా ‘వ్యవసాయ ప్రగతి’ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని, దీని ద్వారా రైతులు పార్టీకి మరింత సన్నిహితం అయ్యేందుకు వీలు కలుగుతుందనే సూచన సన్నాహాక సమావేశాల్లో వచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ లబ్ధ్దిదారులతో ఆడబిడ్డల ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలనే నాయకులు సూచించారని తెలిపారు.
కేసీఆర్ 20 ఏండ్లు సీఎంగా ఉండాలన్నదే కల
తెలంగాణే టీఆర్ఎస్ కార్యక్షేత్రమని, అది మినహా తమకు ఇతర ప్రాధాన్యతలు లేవని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘మేం గుజరాత్ గులాములం కాదు. ఢిల్లీ బానిసలం కాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే తలవొగ్గుతం. వారికి మాత్రమే శిరస్సు వంచుతం తప్ప ఎవరి ముందు మెడలు వంచం’ అని తేల్చిచెప్పారు. కేసీఆర్ సీఎంగా పదేండ్లు కాదు, 20 ఏండ్లు ఉండాలన్నదే మా కల అని పేర్కొన్నారు.