న్యూఢిల్లీ: జీవితా బీమా సంస్థ గురించి ఇవాళ లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర్ రావు ప్రశ్న వేశారు. ఎల్ఐసీ ప్రవేటీకరిస్తున్నారా అని ఆయన కేంద్రాన్ని అడిగారు. ఒకవేళ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరించడం వల్ల .. ఉద్యోగ కల్పనకు ఏదైనా సమస్య ఉంటుందా అని ఎంపీ నామా అడిగారు. షేర్ హోల్డర్లు, పాలసీదారులకు రావాల్సిన ఆదాయం తగ్గుతుందా.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలని ఎంపీ నామా కేంద్రాన్ని అడిగారు. మంత్రి అనురాగ్ ఠాకూర్ యువకుడు అని, ఎటువంటి బుల్డోజ్ చేయకుండా సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఎంపీ నామా కోరారు. దీనికి బదులుగా మంత్రి అనురాగ్ సమాధానం ఇచ్చారు. ఎంపీ నామా తనకు మంచి మిత్రుడని, సీనియర్ అని మంత్రి అనురాగ్ పేర్కొన్నారు. జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎల్ఐసీ మార్కెట్ విలువను పెంచతున్నామన్నారు. ఐపీఓ మాత్రమే ఇస్తున్నామని, దీని ద్వారా ఆ సంస్థ రియల్ వాల్యువేషన్ పెంచుతున్నట్లు మంత్రి అనురాగ్ వెల్లడించారు. ఎల్ఐసీ విలువను అంచనా వేసేందుకు సర్వే చేయిస్తున్నామని, ఎంత శాతం షేర్లను డిజిన్వెస్ట్ చేయాలన్న దానిపై సలహాలు పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి కూడా ఎల్ఐసీపై ప్రశ్న వేశారు. జీవిత బీమాలో డిజిన్వెస్ట్ ప్రకటనకు ముందు.. 21 కోట్ల మంది పాలసీదారుల అభిప్రాయాలను సేకరించారా అని అడిగారు. అయితే పాలసీ హోల్డర్లతో చర్చలు చేపట్టడం సరికాదు అని అన్నారు.