హైదరాబాద్ : బీజేపీ ఎంపీ బండి సంజయ్పై టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. సంజయ్ తన పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎంపీగా ఉండి ఇంత నీచంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతకు ఆనంద్తో కలిసి బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు.
సంజయ్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి తెలంగాణకు సహకారం అందించకుండా, మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందన్నారు. పాత నగరానికి వేరేలా, ఇతర ప్రాంతాలకు మరోలా ఉండదన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ పథకాలు అమలు కావడం లేదని సంజయ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దళితులను ఆదుకునేందుకే దళితబంధు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. దమ్ముంటే దేశంలోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేసేలా మోదీని ఒప్పించాలని సంజయ్కు సవాల్ చేశారు. బీజేపీది దొంగల ప్రభుత్వం అని విమర్శించారు. దేశంలో కేసీఆర్ నాయకత్వం రావాలని పలు రాష్ట్రాలు కోరుకుంటున్నాయని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు.