న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత ఎంపీ కే కేశవ రావు కోరారు. ఇదే అంశాన్ని చర్చించాలని లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
నవోదయ విద్యాలయ సమితి.. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దేశంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ విద్యాలయాలు నాణ్యమైన విద్యలో అగ్రగామిగా ఉన్నాయి. రాష్ట్రాలలోని ఇతర సంస్థలకు ఇవి ఆదర్శంగా పనిచేస్తాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ప్రకటన జరిగింది. నవోదయ విద్యాలయాల స్థాపన విద్యా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది…, అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ఆ విద్యాలయాల ఏర్పాటు తప్పనిసరి. నూతన విద్యా సంవత్సరం అమలులోకి వస్తున్నందున ఈ అంశం చాలా ముఖ్యమైనదని వాయిదా తీర్మానంలో కేశవరావు, నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
నోటీసులు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మానికమ్ ఠాకూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. పెరిగిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన తన తీర్మానంలో కోరారు. పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్లో మహిళలు, చిన్నారుల పట్ల జరిగిన అమానవీయ ఘటన గురించి జీరో అవర్లో చర్చించాలని బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను వెనక్కి తీసుకోవాలని రాజ్యసభలో ఎంపీ సుశీల్ మోడీ జీరో అవర్ నోటీసు ఇచ్చారు.