హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బిలిస్బానో లైంగికదాడి కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకొని, మానవత్వాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు. ‘బిలిస్బానో లైంగికదాడి కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రూపొందించిన 1992 విధానం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం వారి రెమిషన్కు అనర్హత విధించవచ్చు. లైంగికదాడి వంటి నేరాలు మన సామాజిక సృ్పహను కుదిపేస్తాయి.
శిక్ష పడిన రేపిస్టులు స్వాతంత్య్ర దినోత్సవంనాడు బయటికిరావడంతో ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతున్నది’ అని ఆమె శుక్రవారం సీజేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని, సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి శిక్ష విధించిందని ఆమె గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్ 435(1)(ఏ) చెబుతున్నదన్నారు. అయితే ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని తెలిపారు.
చట్టాలపై విశ్వాసాన్ని కాపాడండి..
‘ఈ క్రూరమైన నేరం జరిగినప్పుడు బిలిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణీ. రేపిస్టులు బయటకు రావడాన్ని, ఈ పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బానో మనసు ముకలై ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దోషుల విడుదల నిర్ణయాన్ని వెనకి తీసుకొనేలా చర్యలు చేపట్టి చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థిస్తున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత సీజేకు విజ్ఞప్తి చేశారు.