హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వాటిని ఉచితాలుగా పేర్కొనటాన్ని ఆమె తప్పుబట్టారు. మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేయటాన్ని ఎలా సమర్థించుకొంటారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఆపి, కార్పొరేట్లకు దోచిపెట్టడమే కేంద్రం విధానంగా మారిందని దుయ్యబట్టారు.
పెద్దలకు లక్షల కోట్ల రుణమాఫీ చేయాలి.. కానీ, పేదలకు పెన్షన్లు వద్దా? అని నిప్పులు చెరిగారు. పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రాష్ట్రంలో 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తగా మరో 10 లక్షల మందికి ఇవ్వబోతున్నామని స్పష్టంచేశారు. 65 లక్షల మందికి రైతు బంధుతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. ‘రైతు బంధు ఆపాలా? గురుకుల విద్యను ఆపాలా?, చేపలు, గొర్రెల పెంపకం ఆపాలా? ఆసరా, బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు ఆపాలా.. ఇవన్నీ ఉచితాలా?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను, ఉచిత పథకాలను వేర్వేరుగా చూడాలని హితవు పలికారు. సంక్షేమ పథకాలు ఆపేందుకు కోర్టులను సైతం ఉపయోగించుకుంటున్న బీజేపీ ప్రభుత్వ తీరును దేశంలోని ప్రతిఒకరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యుత్తు సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సమీక్ష కోసం పంపిందని గుర్తుచేశారు. కేంద్రం నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, వ్యతిరేకతను తెలియజేస్తే ఆ నిర్ణయాన్ని ఆపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.