పట్టభద్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
విజయంతో నా బాధ్యత రెట్టింపయ్యింది
సీఎం కేసీఆర్ అన్నీ తానై విజయం వైపు నడిపించారు
సీఎం, మంత్రులు, శ్రేణులకు ఈ విజయం అంకితం
నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో వాణీదేవి
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగునే ఓ సంచలనంగా మార్చుకున్నారు ఎస్ వాణీదేవి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంపై తొలిసారి గులాబీజెండా రెపరెపలాడించారు. ఈ స్థానం నుంచి విజయం సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. చరిత్రాత్మక విజయం సందర్భంగా వాణీదేవి నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటి అడుగే విజయంతో ప్రారంభించడం ఎలా అనిపిస్తున్నది?
నా జీవితంలో ఇదొక గొప్ప సందర్భం. సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా అనిపిస్తున్నది. అన్నీ తానై ప్రత్యక్షంగా, పరోక్షంగా నా వెంట ఉండి గెలిపించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కాస్త ఆలోచించిన సమయంలో ధైర్యం చెప్పారు. వెన్నుతట్టి, మార్గనిర్దేశం చేశారు. దానికి తగిన ఫలితం దక్కింది. ప్రజలు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. కొత్త శకానికి నాంది పలికారు.
యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మీ వద్ద ఉన్న ప్రణాళికలేంటి?
నాపై నమ్మకం ఉంచిన పట్టభద్రులకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ విజయంతో బాధ్యత రెట్టింపయ్యింది. దశాబ్దాలుగా విద్యావృత్తిలో ఉన్న నాకు.. ఉద్యోగులు, యువత ఏం కోరుకుంటున్నారో, వారి సమస్యలు తెలుసు. నాపై ఉంచిన బాధ్యతను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషిచేస్తా. యువతకు ఉపాధి, ఉద్యోగాలు చేస్తున్నవారికి ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తా.
మొదటి ప్రాధాన్య, రెండో ప్రాధాన్య ఓటులోనూ స్పష్టమైన ఆధిక్యం చూపారు. ఎలా విశ్లేషిస్తారు?
వెయ్యి అబద్ధాలపై నిజం గెలిచింది. యువత, ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నా.. విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి. కానీ, పట్టభద్రులు మేధావులు. రాష్ట్రంలో అభివృద్ధిని, సమాజంలో పరిణామాలను నిశితంగా పరిశీలించిన వ్యక్తులుగా టీఆర్ఎస్కు విజయం కట్టబెట్టారు. మొదటి ప్రాధాన్య ఓటులోనే నేను వారికి ప్రతినిధిగా ఉండాలని నిర్ణయించారు. రెండో ప్రాధాన్య ఓటులోనూ నావైపే మొగ్గు చూపారు. ఈ క్రెడిట్ టీఆర్ఎస్ పాలనదే.
‘హైదరాబాద్’ స్థానంలో టీఆర్ఎస్ తొలిసారి గెలిచింది. ఇక్కడ గెలిచిన మొదటి మహిళా మీరే. ఈ చరిత్రాత్మక విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారు?
ఈ విజయం నా ఒక్కదానిది కాదు. సీఎం కేసీఆర్ మొదలు టీఆర్ఎస్ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిది. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, శ్రేణులు కొండంత అండగా నిలిచారు. ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాను.
ఈ విజయంలో పీవీ నరసింహారావు చరిష్మా ఎంతవరకు ఉపయోగపడిందని భావిస్తున్నారు?
పీవీ కూతురుగా పుట్టడం నా అదృష్టం. ఈ గుర్తింపునకు మొదటి మెట్టు కూడా అదే. వాణీదేవి అంటే పీవీ కూతురు. నా విజయంలో తప్పకుండా నాన్నగారి పాత్ర ఉంటుంది. రాష్ట్ర ప్రజల మనుసుల్లో ఆయనకు సుస్థిర స్థానం ఉన్నది. ఆయనకున్న క్లీన్ ఇమేజ్, సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన కలిసి నాకు ఘన విజయాన్ని అందించాయి. ఈ సందర్భంగా నాకు మంచి పుట్టుకను ఇచ్చిన భగవంతుడికి, మా నాన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రాజకీయ పరిచయం ఉన్నా.. ప్రత్యక్షంగా సభలు, సమావేశాల్లో పాల్గొనడం, ప్రచారం చేయడం మొదటిసారి. ఈ అనుభవం ఎలా ఉన్నది?
నాకు క్లాస్రూమ్లో పాఠాలు చెప్పడం, సెమినార్లలో వందలమంది ముందు మాట్లాడటం కొత్తేమీ కాదు. రాజకీయ సభల్లో మాట్లాడటం భిన్నమైన అనుభవం. ఓటర్లందరూ పట్టభద్రులు, విద్యాధికు లు. సమాజంపై అవగాహన ఉన్నవాళ్లు. వాళ్లతో మాట్లాడటానికి ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకొన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం వారికోసం చేస్తున్న పనులను చెప్పాను. వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తానో వివరించాను. ఓటర్ల తీర్పుతో ప్రయత్నం లో విజయం సాధించానని నిరూపితమైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ రెండు వారాల అనుభవం మాత్రం నాకు జీవితాంతం గుర్తుంటుంది.