హైదరాబాద్ : ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని, ప్రపంచంలోని ప్రఖ్యాత ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఐటీ పద్దులపై ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడారు. రాష్ర్టం ఏర్పడే నాటికి ఐటీ ఎగుముతుల రూ. 66 వేల కోట్లు ఉంటే.. 2020 నాటికి రూ. 1.27 లక్షలకు చేరాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలు 43 లక్షలు ఉంటే.. ఒక్క తెలంగాణ రాష్ర్టం 5 లక్షల 82 వేల మందికి ఐటీ సంస్థల్లో ఉపాధి కల్పించామని చెప్పారు.
పెట్టుబడుల విషయంలో అమెజాన్ సంస్థ రూ. 20 వేల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్లో పెడుతుందన్నారు. 2014లో ఐటీ శాఖ మంత్రి.. ఐటీ నిపుణులతో చర్చించి టీ హబ్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రతన్ టాటాతో టీహబ్ను ప్రారంభించి.. కొత్త పుంతలు తొక్కించారని పేర్కొన్నారు. టీ హబ్ ద్వారా 337 మంది కొత్త పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించారని తెలిపారు. టీ వర్క్స్ ద్వారా రూ. 35 వేలకు వెంటిలేటర్లను తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఐటీ శాఖకు దక్కుతుందన్నారు. నగరం నలువైపులా ఐటీని విస్తరిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాస్క్ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. టీ శాట్ ద్వారా పిల్లలకు డిజిటల్ విద్యను అందిస్తున్నామని చెప్పారు. కృత్రిమ మేధస్సులో హైదరాబాద్ ఉండేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు.