హైదరాబాద్ : కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ, అమిత్ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేశ్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్ డై వర్షన్) ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అనీ, కేసీఆర్ ఉద్యమ బెబ్బులి అన్నారు. కేసీఆర్ను ఎదుర్కోలేక బీజేపీ.. ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
సీఎంను ఎలా ఎదుర్కోవాలో తెలియక కాషాయ పార్టీ బురద జల్లే రాజకీయం చేస్తుందని ఆరోపించారు. తప్పుడు కేసులకు, కాసులకు టీఆర్ఎస్ లొంగిపోదని, భయపడదని స్పష్టం చేశారు. కేసీఆర్ రాజీపడి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదే కాదన్నారు. కళంకితులకు అడ్డ, అక్రమార్కులకు అడ్డగా బీజేపీ మారిందని, సీబీఐ సెంట్రల్.. బీజేపీ ఇన్వెస్టిగేషన్గా మారిందని ఆరోపించారు. సింధియా, హేమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరగానే.. ఈడీ విచారణ ఆగిపోయిందని గుర్తు చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ అనుబంధ విభాగాలుగా మారి సీబీఐ, ఈడీలు దాడులు చేస్తున్నాయని, అస్థిర పరిచే రాజకీయాలకు.. అస్థిత్వ రాజకీయాలకు తెలంగాణలో యుద్ధం మొదలైందన్నారు. బండి సంజయ్ చదువుకోలేదని, ఆయనకు ఏం తెలియదన్నారు.
కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన రోజు బండి సంజయ్ నెక్కర్లు కూడా వేసుకోలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి సంచులు మోసే వారు.. బీజేపీ నేతలు బూట్లు మోస్తున్నారని, బండి సంజయ్.. బానిస సంజయ్లా మారాడని విమర్శించారు. అమిత్ షా చెప్పులు మోస్తాడా? తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టాడా?.. ఆత్మగౌరవం తాకట్టు పెట్టే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను ఉద్దరిస్తాయా? అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ శిఖండి రాజకీయాలు కేసీఆర్ను ఏం చేయలేవని, కేసీఆర్కు పెద్ద మనసు ఉంది కాబట్టే కాంగ్రెస్, బీజేపీ నేతలు బతికిపోతున్నారన్నారు. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నారని, కవిత ఇంటిపై దాడి చేస్తారా?.. మేం తలచుకుంటే కిషన్రెడ్డి, బండి సంజయ్ తిరగ గలరా? అని ప్రశ్నించారు.
బండి సంజయ్ బూట్లు మోయడం కాదు.. తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు అమిత్షాతో సమాధానాలు చెప్పించాలని సూచించారు. తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు బండి సంజయ్ బానిసలా చెప్పులు మోశారా?.. బీజేపీ నేతలు చవటలు, సన్నాసులు, దద్దమ్మలని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంపై బీజేపీ బురద జల్లడాన్ని తెలంగాణ సమాజం గమనించాలని, కవిత ఇంటిపై బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నామని, బీజేపీ నిన్నటి ఘటనపై బేషరతుగా క్షమాపణలు డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీకి రాజగోపాల్ కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయాడని, ఎన్నికలోల్ చిత్తు చిత్తుగా ఓడిపోతారన్నారు.
ఎమ్మెల్సీ కవితను బద్నాం చేసే బీజేపీ కుట్రను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అనే విషయం మరిచిపోవద్దని, దీటుగా బదులిస్తామన్నారు. కేసీఆర్ను అరెస్ట్ చేస్తామని బండి సంజయ్ పదే పదే అంటున్నారని, అరెస్టు చేయడానికి బండి సంజయ్ ఎవడు ? అని ప్రశ్నించారు. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగోళం అవుతుందన్నారు. కుటుంబ రాజకీయాలపై మాట్లాడుతున్నారని, దేశంలో వారసులు లేని పార్టీ ఏదైనా? అని నిలదీశారు. బీజేపీ నేతలపై సీబీఐ, ఈడీ
దాడులు ఎందుకు జరుగడం లేదని, వాళ్లు పునీతులా అని మండిపడ్డారు. ఎక్కడో చేసిన కుట్రలు బీజేపీ తెలంగాణలో చేస్తే పుట్టగతులు ఉండవని, బీజేపీకి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఓటు బ్యాంకు తప్ప ప్రజల అండ లేదన్నారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలు ఇకనైనా మానాలని, కేసీఆర్ కుటుంబంపై బురద జల్లి ఎదో సాధిస్తామని బీజేపీ అనుకుంటే కుదరదని స్పష్టం చేశారు.