నల్లగొండ : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో బాల్క సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ఎంపీ రేవంత్ రెడ్డి పెద్దవూర మండలంలో ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ స్పందించారు. ఆంధ్రా పాలకుల చెంచాలుగా పని చేసిన రేవంత్కు నేడు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2018లో కొడంగల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయావ్.. అయినా సిగ్గు రాలేదు. కొండగల్ లో తంగే మల్కాజ్గిరిలో పడ్డావు.. అక్కడ తంతే ఎక్కడ పడుతావో చూసుకోవాలన్నారు. పెయింటర్గా పని చేసిన నువ్వు నేడు ఇన్ని కోట్లు ఎలా సంపాదించావు అని రేవంత్ను బాల్క సుమన్ ప్రశ్నించారు. శునకానందంలో పెద్దోళ్ల గురించి మాట్లాడుతున్నావ్.. మళ్లీ జైల్లో చిప్పకూడు తినడం గ్యారంటీ అని అన్నారు.
కేసీఆర్ పదవులను ఎడమకాలు చెప్పు లెక్క వదిలిపెట్టిండు అని సుమన్ తెలిపారు. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు అని పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడికి పోయావ్ సన్యాసి రేవంత్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఉద్యమం నడుపుతున్నప్పుడు నువ్వు చంద్రబాబు దగ్గర చెప్పులు మోస్తూ ఉన్నావ్. చంద్రబాబు సంక నాకుతున్నావ్ అని ఎమ్మెల్యే సుమన్ మండిపడ్డారు.
మైకులు దొరక్కగానే కుక్కలాగా మొత్తుకోవడం సరికాదన్నారు. బాల్క సుమన్ ఒక్క పిలుపు ఇస్తే తన అభిమానులు, కార్యకర్తలు, విద్యార్థులు వచ్చి నీ చెడ్డిలో తొండలు వదులుతారు అని చెప్పారు. రేవంత్కు కేసీఆర్ పేరు కాదు.. బాల్క సుమన్ పేరు కూడా పలికే అర్హత లేదన్నారు. తాను ఉద్యమం చేస్తూ జైలుకు వెళ్తే.. రేవంత్ హైదరాబాద్లో కబ్జాలు చేస్తూ బతికాడు అని పేర్కొన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను రేవంత్ ఏనాడైనా పట్టించుకున్నాడా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి ఫ్లోరైడ్ రక్కసి నుంచి విముక్తి కల్పించారు అని గుర్తు చేశారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిందని, ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు అని బాల్క సుమన్ సూచించారు.