హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విశ్వాస ఘాతకుడు అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఆయన తిన్నింటి వాసాలను లెక్కబెట్టారని మండిపడ్డారు. 2004కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ..? ఈటెలను మంత్రి చేసింది కేసీఆర్ కదా? అని సుమన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానందతో కలిసి బాల్క సుమన్ టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడారు.
ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని సుమన్ పేర్కొన్నారు. ఆయన శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్లో రాజేందర్ ఓటమి ఖాయమన్నారు. అందుకే గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈటెల కేసీఆర్పై పోటీ చేసే సిపాయా? అని ప్రశ్నించారు. ఆయన ఓ చెల్లని రూపాయి అని విమర్శించారు. పబ్లిసిటీ కోసమే ఈటెల ఈ తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీలో ఈటెలది బానిస బతుకు అని తెలిపారు.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని బాల్క సుమన్ సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అని నిలదీశారు. గవర్నర్ రాజకీయం చేస్తున్న తీరును మీడియా కూడా ఖండించాలన్నారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించేవారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా అని సుమన్ ప్రశ్నించారు.