నల్లగొండ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి జానారెడ్డి చేసేందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల నాగార్జున సాగర్ ప్రజలు మంచి ఆదరణ చూపుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసం ఉందన్నారు. బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలువబోతుందని చెప్పారు. సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ హయాంలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే సాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు. సబ్బండ వర్గాలు టీఆర్ఎస్ పార్టీకి వెల్లువలా మద్దతు తెలుపుతున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు మంత్రిగా పని చేసిన జానారెడ్డి.. ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. వెనుకబాటుకు గురి చేశారు.
మండలానికో సామంతరాజును పెట్టుకుని నడిపించారు. బడుగు, బలహీన వర్గాలను జానారెడ్డి దగ్గరకు రానివ్వలేదు. ఆ సామంతరాజులే చెప్పిందే జానారెడ్డికి వేదం అన్నారు. 1400 బెడ్రూం ఇండ్లను సాగర్కు మంజూరు చేస్తే.. పేద వర్గాలకు కట్టించి ఇవ్వలేదు. ఇటీవలే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హాలియాలో డిగ్రీ కాలేజీ పనులు జరుగుతున్నాయి. విద్యుత్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నాం.
తండాలకు పూర్తిగా రాజ్యాధికారం కల్పించాం. మిషన్ భగీరథ కింద అన్ని గ్రామాలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్నాం. మొత్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా విరాజిల్లుతుందన్నారు. జానారెడ్డి రాచరిక పాలన కొనసాగించారు. జానారెడ్డి పరిపాలనను, దివంగత ఎమ్మెల్యే నోముల పరిపాలనను ఒకసారి సరిపోల్చుకోవాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. నాగార్జున సాగర్ను ఇప్పటికే అన్నివిధాలా అభివృద్ధి చేశాం.. మరింత అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు నష్టం కలిగిస్తున్నారు. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుమన్ అన్నారు.