హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత మోదీ సర్కారే వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీలో చేరడాన్ని యువత దైవకార్యంగా భావిస్తుంది. కానీ యువతను మోదీ విస్మరించడం బాధ్యతరాహిత్యమని మండిపడ్డారు. ఇప్పటికైనా మోదీ ఈ పథకాన్ని పున:సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు. మోదీ అదానీ సేవలో తరిస్తూ.. దేశ ప్రజలను మరిచిపోతున్నారని విమర్శించారు.
మోదీ తుగ్లక్ విధానాలపై దేశం గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ఫాసిస్ట్ విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణలో జరిగిన హింసకు టీఆర్ఎస్ బాధ్యత వహించాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం దుర్మార్గమని చెప్పారు. మోదీ తూటాలకే తెలంగాణ బిడ్డలు బలయ్యారని బాల్క సుమన్ పేర్కొన్నారు. మోదీ తూటాలకు బలైన రాకేశ్ కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీకి శంకరగిరి మాన్యాలు తప్పవన్నారు. తెలంగాణ బిడ్డల రక్తం కళ్లజూసిన వారెవ్వరూ బాగుపడలేదని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ నుంచి కన్యకుమారి దాకా ప్రజలందరూ బీజేపీపై తిరుగుబాటు చేయాలని కోరారు. ఆర్మీ నియామక ప్రక్రియను తక్షణమే చేపట్టాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.