హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా సీఎం కేసీఆర్ను ఏకవచనంతో మాట్లాడటం సరికాదు. గాలి మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. అది సరికాదు అని బాల్క సుమన్ అన్నారు.
తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రయోజనాలను గాలికి వదిలేసింది బీజేపీ ప్రభుత్వం. కరోనా విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడితే మంచిది. కొవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్, హెల్త్ సెక్రటరీతో నిత్యం మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా కట్టడికి సీఎం తీవ్రమైన కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సింది పోయి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.
బండి సంజయ్ తీరును రాష్ర్ట ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. చిల్లర మాటలు మాట్లాడినందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోరంగా ఓటమి చవిచూసినప్పటికీ, వారికి బుద్ధి రాలేదు. నోరు తమ మీద పారేసుకోవడం మాని.. దమ్ముంటే రెమ్డెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరతపై కేంద్రాన్ని నిలదీస్తే బాగుంటుందని సూచించారు. బీజేపీ నాయకులను ప్రజలు హర్షించే దశలో లేరు అని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద అడ్డగోలుగా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ సంక్లిష్టమైన సమయంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు అని బాల్క సుమన్ తెలిపారు.