‘శుభం పలుకరా పెండ్లి కొడుకా అంటే పెండ్లి కూతురు ఎక్కడ చచ్చింది’ అన్నాడట. తెలంగాణలోని పరాయిశక్తుల తాబేదారులు, మీడియా వ్యవహారం ఇలాగే ఉన్నది. తెలంగాణ ఉద్యమకాలంలో ఇదే వ్యతిరేక వైఖరి. రాష్ర్టాన్ని సాధించుకొని చక్కగా లించుకుంటున్నా ఇదే బురద జల్లుడు. నిజాలను వక్రీకరిస్తూ, అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సందర్భంగా మీడియా వ్యాఖ్యానాలు ఇందుకు తాజా ఉదాహరణలు.
మన రాష్ట్రంలో 12 స్థానిక మండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరింటిని టీఆర్ఎస్ పోటీ లేకుండానే గెలుచుకున్నది. సరిపోయిందా! ఇంక మిగిలింది – ఆరు. ఆ ఆరింటిని కూడా టీఆర్ఎస్సే గెలుచుకున్నది. ఇక వంక పెట్టడానికేమున్నది! అసెంబ్లీ ఎన్నికల తరువాత పరాయిశక్తుల కుట్రల్లో చెప్పుకోదగిన అంశం- టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అన్ని పక్షాలను జట్టుకట్టించడం. ఈ ఎన్నికల్లోనూ అదే జరిగింది. టీఆర్ఎస్ మొదటి పర్యాయం పాలన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత కొద్దీ అధికారపక్షం ఓడిపోతుందని పరాయి శక్తులు భావించాయి. కానీ టీఆర్ఎస్ బలం ఇంకా పెరిగిపోయింది. టీఆర్ఎస్ తప్ప అన్ని రాజకీయపక్షాలను ఆడించేది వాళ్ళే కదా! ఇక నుంచి టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా తెరవెనుక సర్దుబాట్లు చేయించాలనే కుట్ర మొదలైంది. పైకి కాంగ్రెస్, బీజేపీ వగైరా ముసుగులు ఉండనే ఉంటాయి. కానీ లోపల అన్నీ ఒకటే. వాటిని నియంత్రించేది తెలంగాణ వ్యతిరేక శక్తులే. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎన్నికల ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్, బీజేపీ ఎంత అప్రతిష్ఠాకరంగా పొత్తు పెట్టుకుంటున్నాయో తెలుస్తుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జరిగింది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు ఎక్కడా చీలిపోకుండా పన్నాగం పన్నారు.
కరీంనగర్లో కాంగ్రెస్కు 170, బీజేపీకి 108 ఓట్లున్నా యి. మరి అవేమయ్యాయి? స్వతంత్ర (ఉమ్మడి) అభ్యర్థికి 232 ఓట్లు ఎలా వచ్చాయి? ఖమ్మంలో కాంగ్రెస్ ఓట్లు 116 నుంచి 242కు ఎలా పెరిగాయి. ఇతరపక్షాల దాదాపు 150 ఓట్లు ఏమయ్యాయి? ఉప ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా ఈ అక్రమ బంధం బయటపడుతూనే ఉన్నది. అస్తమానం అవాకులు మాట్లాడే మీడియాకు ఈ విషయం అడగడానికి నోరు పెగలదు. ఇన్ని కుట్రలు పన్నినా టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడమే విశేషం. కరీంనగర్లో టీఆర్ఎస్కు ఉన్నవి 986 ఓట్లు కాగా, వచ్చినవి 1063. నల్లగొండలో టీఆర్ఎస్కు 820 ఓట్లు ఉంటే, వచ్చినవి 917. ఆదిలాబాద్లో టీఆర్ఎస్ ఓట్ల సంఖ్య 725 అయితే లభించినవి 742. చాలాచోట్ల కాంగ్రెస్, బీజేపీ బొక్కబోర్లా పడ్డాయి. ఇందుకు కారణాలేమిటి అనేవి ఈ మహా విశ్లేషకులకు పట్టదు. రంధ్రాన్వేషణ సాగిస్తూ ఎక్కడ టీఆర్ఎస్ను తప్పుబట్టాలనేదే వీరి వంకర బుద్ధి. ఆరు స్థానాలను పోటీ లేకుండా గెలుచుకొని, మరో ఆరు స్థానాలలో అప్రతిహతంగా విజయం సాధించడం వీరికి కనిపించదు.
మరి ఈ వక్రబుద్ధులకు కనిపించేదేమిటి? ఖమ్మం, మెదక్ స్థానాల్లో కొన్ని ఓట్లు తగ్గడం! అవి మాత్రం ఏ పాటి? ఖమ్మంలో టీఆర్ఎస్కు 497 ఓట్లు ఉంటే, వచ్చినవి 480. అంటే తగ్గింది పదిహేడు ఓట్లు! ఈ మాత్రానికి ఈ ఫలితాలు అధికారపార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయం టూ వ్యాఖ్యానం. టీఆర్ఎస్కు బాగా డ్యామేజ్ జరిగిందట. ఎందుకు మైనస్ అయ్యాయనేది ఆలోచించుకోవలసిన పరిస్థితట! ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. పైగా మన సమాజంలో వైవిధ్యం ఎక్కువ. ఈ ప్రభావం రాజకీయాలపై తప్పనిసరిగా ఉంటుంది. ఒకే పార్టీలోని భిన్నవర్గాలు తమ అభ్యర్థిని ఎంపిక చేయించుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. అధిష్ఠానం మీద ఒత్తిడి తెస్తాయి. పార్టీ నాయకత్వం ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత కలిసి గెలిపించుకుంటాయి. ఇది ఎక్కడైనా సాధారణంగా జరిగేదే. నాయకుల మధ్య మనస్పర్ధలు కూడా ఉంటాయి. ఈ మాత్రం దానికి ఒక నాయకుడిని పిలిపించి టీఆర్ఎస్లో గొడవలవుతున్నట్టు- వీరి పైత్యాన్నంత అతడి నోట చెప్పించే ప్రయత్నం చేయడం వికృత చేష్ట. స్థానిక ఎన్నికలు అన్న తరువాత కొన్ని ఓట్లు అటూఇటూ కావడంలో ఆశ్చర్యమేమున్నది. ఈ మాత్రం దానికే ఇన్ని వక్రభాష్యాలా? ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపి ఆనందం పొందడమా! కోడి గుడ్డుకు ఈకలు పీకడం అంటే ఇదే!
సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. కేసీఆర్ వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారు. గ్రామీణ ప్రాంతాన్ని సంపన్నం చేశారు. పారిశ్రామికంగా రాష్ట్రం పరుగులు పెడుతున్నది. అందుకనే టీఆర్ఎస్ ఇప్పటికీ అజేయశక్తిగా ఉన్నది. పరాయిశక్తులు ఎన్ని కుట్రలు చేసినా, మీడియా ఎన్ని కూతలు కూసినా, ప్రతిపక్షాలన్నీ కట్టుకట్టుకొని కలియబడినా టీఆర్ఎస్ను ఓడించలేవు.
మెదక్లో టీఆర్ఎస్కు ఉన్నది 770 ఓట్లు. పార్టీ అభ్యర్థికి వచ్చినవి 762. తగ్గిన ఓట్లు ఎనిమిది! కాంగ్రెస్ ఓట్లు 230 అయితే మరో ఎనిమిది ఓట్లు ఎక్కువ పడ్డాయి. దీనివల్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందీ లేదు, టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయిందీ లేదు. ఓ కాంగ్రెస్ నాయకుడు తమ అభ్యర్థి విషయంలో ఏదో ప్రతిజ్ఞ చేశాడట! తమ అభ్యర్థిని గెలిపించుకుంటానని అయితే ప్రతిన చేయలేదు. గెలిపించుకోనూ లేదు. అదీ సాధ్యం కాదని ఆయనకూ తెలుసు, అందరికీ తెలుసు. అయినా అతడేదో ప్రతిజ్ఞ చేసి నెగ్గించుకున్నట్టు హీరోను చేసిచూపడం ఆశ్చర్యకరం. టీఆర్ఎస్ విజయాన్ని వీలైనంత తక్కువగా చేసి చూపడం, బురద జల్లడం- ఆ సర్కస్ ఫీటును డిబేట్గా చెప్పుకోవడం!
ఉద్యమకాలం నుంచి పరాయి శక్తులు మనల్ని మానసికంగా బలహీనపరిచే కుట్రలు చేస్తూనే ఉన్నాయి. తెలంగాణ పోరాటం విజయవంతమై రాష్ట్ర సాధన దగ్గర పడిన తరువాత కూడా ప్రజల్లో నైరాశ్యాన్ని నింపే ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, బీజేపీ కార్యవర్గం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపినా వక్రభాష్యాలు చెప్పాయి. వీరు నైరాశ్యం నింపడం వల్ల వందలాది మంది తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకున్నారు. కేసీఆర్ను వీలైనంత తక్కువ చేసి చూపడం, తెలంగాణను అపహాస్యం పాలు చేయడం, తద్వారా మన ఆత్మైస్థెర్యాన్ని దెబ్బకొట్టడం ఈ కూతల వెనుకున్న కుట్ర.
కానీ, తెలంగాణ ఏకైక రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ప్రజల్లో పాతుకుపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం, ఆరాధనా భావం ఉన్నది. కేసీఆర్కు జనంలో భారీ అభిమానం ఉన్నందు వల్ల క్రాస్ ఓటింగ్ కహానీలు నడవవు. ఒకరో ఇద్దరో ఊగిసలాడవచ్చు. కొం దరు ప్రలోభపడాలనుకున్నా ధైర్యం చాలదు. అటువంటివారికి దీర్ఘకాలంలో రాజకీయ భవిష్యత్తు ఉండ దు. అందుకే కేసీఆర్ నైతిక బలం, జనబలం ముందు ధనమదం నిలువలేక పోతున్నది. స్థానిక ఎన్నికల ఫలితాల సారాంశమిదే.
–సహ్య