ధాన్యం కొనుగోలుపై దశలవారీగా ఆందోళనలు
టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు పిలుపు
పాల్వంచ, ఏప్రిల్ 3: తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ ధాన్యం కొనుగోలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నదని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు సైతం తెలంగాణ ప్రజలను హేళన చేస్తూ మాట్లాడటం బాధాకరమన్నారు. సదరు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు సోమవారం నుంచి 11వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉద్యమించాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.