మంచిర్యాల: అచ్చేదిన్ ఆగయా.. అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సచ్చేదిన్ తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మండిపడ్డారు. మోదీ అధికారంలోకి రాకముందు కేవలం రూ. 400 ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1,105కు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రూ. 50 పెంచడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుతో పాటు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, దేశం కోసం, ధర్మం కోసం అంటూ బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని, సామాన్యులపై తీవ్రమైన ధరల భారం వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
మోదీ సర్కారు గ్యాస్తోపాటు పెట్రోలు, డీజిల్, వంట నూనెలు, నిత్యావసరాల ధరలను అమాంతంగా పెంచిందని, పేద, మధ్యతరగతి మహిళలపై మోయలేని భారాన్ని వేస్తున్నదని బాల్క సుమన్ మండిపడ్డారు. మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం మునగక తప్పదని హెచ్చరించారు. దేశ ప్రజలంతా పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే గ్యాస్తోపాటు పెట్రోల్, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ, మోదీ గద్దెనెక్కిన నాటి నుంచి మహిళలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వంట గ్యాస్, నూనెల ధరలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు. మహిళల ఆగ్రహానికి గురైన ప్రభుత్వాలు పతనమవడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్లు పెంట రాజయ్య, జంగం కళ, వైస్ చైర్మన్ ముకేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్ల భూమేశ్, టీఆర్ఎస్ యూత్ నాయకులు నడిపెల్లి విజ్జిత్ రావు, గోగుల రవీందర్ రెడ్డి, జయ రామారావు, తోట తిరుపతి, సదమల్ల హరికృష్ణ, కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.