హైదరాబాద్, అక్టోబర్ 5, (నమస్తే తెలంగాణ): గుజరాత్ మాడల్ అంటూ దేశంలో జరిగిన ప్రచారం వట్టి భ్రమేనని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అక్కడ జరిగింది గోరంత అయితే చెప్పుకొన్నది కొండంతని విమర్శించారు. గుజరాత్ వృద్ధిరేటు 1.25% శాతం పెరిగితేనే అదో పెద్ద గొప్పగా చెప్పుకొన్నారని, అది జీడీపీలో 0.25% కూడా లేదని వివరించారు. తెలంగాణ సాధించిన విజయం అద్భుతమైనదని, దేశంలో అత్యధిక వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని చెప్పారు.
రాజకీయాల గురించి ప్లేటో మొదలుకొని కారల్మార్క్స్ వరకు అనేక మందిచెప్పారని, సమాజానికి ఉపయోగపడేదే రాజకీయమని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయని, వాటిలో టీఆర్ఎస్ ఒక్కటే తన ప్రత్యేకతను నిలబెట్టుకొన్నదని గుర్తుచేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ శుభపరిణామమని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బాగుంటుందని, దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని తాము కలలుగన్నామని, కేసీఆర్ నాయకత్వంలో అది సాధ్యమైందని కేశవరావు తెలిపారు.