సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి అమిత్ షా నగర పర్యటన నేపథ్యంలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకున్నది. బేగంపేటలోని హరిత ప్లాజా వద్ద మంత్రి కాన్వాయ్కి కారు అడ్డు రావడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో పోలీసులే హడావుడి చేయడం వల్ల తాను కారు ముందుకు పోనివ్వలేకపోయానని టీఆర్ఎస్ నేత, గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మీడియాకు తెలిపారు. హరిత ప్లాజా వద్ద జరిగిన వాస్తవాలను పోలీసులకు వివరించానని చెప్పారు. మినర్వా హోటల్లో తరచూ కాఫీ తాగేందుకు వెళ్తుంటానని, శనివారం తాను వెళ్లే క్రమంలో అమిత్ షా వస్తున్నట్లు తెలియదని, పోలీసులు కూడా ముందుస్తుగా చెప్పి ఉంటే కారు తీసుకొని పోయేవాడిని కాదన్నారు. సుమారు 15మంది పోలీసులు తనను దుర్భాషలాడుతూ కారు అద్దాలు పగులగొట్టారని, ఆ సమయంలో రాజ్యాంగ బద్దంగా బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించానని పేర్కొన్నారు. తనకు జరిగిన నష్టంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.